*కమీషన్లు మీరు తిన్నారా మీ నాయకుడా?. * రూ. 20 లక్షల ఖరీదైన భూములను రూ . 40 లక్షలకు ఎందుకు కొన్నారు? * తెనాలి మండల నాయకులతో పరిచయ వేదికలో డాక్టర్ పెమ్మసాని. ‘బుర్రిపాలెంలో జగనన్న కాలనీలను కమీషన్లు తినకుండా కట్టారా! లేదా చెప్పాలి. రూ. 20 లక్షల విలువైన భూములను రూ. 40 లక్షలు ఖర్చుచేసి ఎందుకు కొన్నారో స్పష్టత ఇవ్వాలి. ఆ కమీషన్ల వాటాలు మీరు తిన్నారా? మీ నాయకుడు తిన్నారా? అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అడిగారు. తెనాలి మండలం పెదరావూరు లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన టిడిపి – జనసేన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేసంలో పాల్గొన్న డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తెనాలి రోడ్లను ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదని, ఆ రోడ్లు చూసి అన్నం తినే ఏ ఒక్కరూ వైసిపికి ఓటు వేయలేరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి ఓటర్ నూ పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని, తనకు 1-2 ఏళ్లు సమయం ఇస్తే కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక షరాఫ్ బజార్ లోని జైన్ టెంపుల్ ను ఆయన దర్శించారు.