దుగ్గిరాల తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నిరవధికంగా ఆరో రోజుకు చేరిన క్రమంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి రైతులను పెమ్మసాని గురువారం దుగ్గిరాలలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపును నమ్మిన రైతులు తమ పంటను నిల్వ ఉంచుకొని, ధర ఎక్కువ పలికిననాడు అమ్ముకుంటూ ఉంటారన్నారు. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన పసుపు బస్తాలు అగ్ని ప్రమాదానికి గురై నెల గడిచినా స్పందించని ఈ ప్రభుత్వ తీరును ఆయన తూర్పారబెట్టారు. రైతులకు అందాల్సిన బీమాను సంబంధిత కలెక్టర్, ప్రభుత్వం ముందుగా అంచనా వేయాల్సి ఉన్నా ప్రభుత్వం నేటికీ పట్టించుకోలేదన్నారు. కోల్డ్ స్టోరేజ్ ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేసిన పిదప రైతులను కలుసుకొని ఘటనపై వివరాలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 380 మంది రైతులకు చెందిన 1.40 లక్షల బస్తాల పసుపు కాలిపోయిందని, ఇప్పటివరకు కనీసం ఈ ప్రభుత్వం బీమాకు సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయిందని వాపోయారు. తమ ఎమ్మెల్యే అయితే రెండు నెలలుగా కనిపించకుండా పోయారని, ప్రభుత్వంతో ఆయనకు పనులు ఉంటేనే ప్రజలకు కనిపిస్తారా? అని ఈ సందర్భంగా రైతులు స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించారు. పెమ్మసానికి తమ బాధను వెళ్ళబోసుకున్న వారిలో స్థానిక రైతులు పేర్ని రవి, కళ్ళం రామకృష్ణారెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు ఉన్నారు.