పేదల ఆకలి బాధ తెలియజేసే రంజాన్. * పెదనందిపాడు ఇఫ్తార్ విందులో డాక్టర్ పెమ్మసాని. ‘పేదల ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఉద్దేశంతో అల్లా పెట్టిన సంస్కృతి పేరే ఈ రంజాన్.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెదనందిపాడు మండల కేంద్రంలో స్థానిక ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒక పండగ చేసుకునే ముందు ఆ పండగ పవిత్రత గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని ఆయన అభిలాషించారు. పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఈ ఇఫ్తార్ విందులో రాజకీయం మాట్లాడడం తనకి ఇష్టం లేదన్నారు. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అధిక శాతం ముస్లింలు పేదరికంలో మగ్గిపోతున్నారని, అలాంటి వారికి తాను వీలైనంత సాయం అందిస్తారని పెమ్మసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ‘చీకటిని వదిలి వెలుగులోకి నడవండి, చెడును వీడి అభివృద్ధిలోకి వెళ్ళండి.’ అన్న అల్లాహ్ ఆదేశానుసారం ప్రతి ఒక్క ముస్లిం అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి నాయకులు సీతారామయ్య, గుంటూరు ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.