తెనాలి మండలం పెదరావూరు లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన టిడిపి – జనసేన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేసంలో పాల్గొన్న డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తెనాలి రోడ్లను ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదని, ఆ రోడ్లు చూసి అన్నం తినే ఏ ఒక్కరూ వైసిపికి ఓటు వేయలేరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి ఓటర్ నూ పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని, తనకు 1-2 ఏళ్లు సమయం ఇస్తే కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక షరాఫ్ బజార్ లోని జైన్ టెంపుల్ ను ఆయన దర్శించారు. కాగా జైన్ దేవాలయ కమిటీ సభ్యులు డాక్టర్ పెమ్మసానిని గౌరవంతో సత్కరించారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ సాధారణ జీవనంలో ప్రశాంతత కోరుకునే వ్యక్తులు జైనులు ముందుంటారని, అలాంటి వ్యక్తుల వ్యాపారాలు, కుటుంబాలను ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జైనులకు ఏదైనా సమస్య వచ్చినా, తన ఆఫీసు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఒక సెల్ ఫోన్ నుంచే వారి వారి సమస్యలను తీర్చేలా ప్రణాళికలు రచిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని వివరించారు.