గుంటూరులోని బి.వి.ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ క్లస్టర్ – 2 మహిళా ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ మధ్య నిషేధం చేస్తానని అక్కాచెల్లెళ్లకు హామీ ఇచ్చారని, కానీ నేడు కల్తీ మద్యాన్ని ప్రభుత్వం ద్వారా విక్రయింపజేస్తూ, మద్యం అమ్మకాల్లో 70% వాటాలను జగన్ జేబులో వేసుకుంటున్నారని పెమ్మసాని పేర్కొన్నారు.జగన్ ప్రభుత్వంలో పేదలకు మిగిలింది నిరాశేనని, యువతకు గంజాయిని అలవాటు చేశారని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలకు సమసమాజ న్యాయం చేయగల సత్తా టిడిపికి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ జగన్ ను ఇంటికి పంపడానికి ఇంకా 30 రోజులు మాత్రమే వ్యవధి ఉందని అన్నారు. రాబోయేది అక్షరాలా మహిళ ప్రభుత్వం అని, టిడిపి వల్లే మహిళలు ఆర్థిక అభివృద్ధి పొందగలరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు, ప్రజలకు ఆర్థిక సమానతలను అందించే విధంగా ‘సూపర్ సిక్స్’ హామీలతో టిడిపి ప్రజల ముందుకు వచ్చిందన్నారు.  కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ టిడిపి ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వందనాదేవి, 46వ డివిజన్ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.