“గతంలో ఇచ్చిన హామీలపై ఆర్కేని నిలదీయండి!మంగళగిరి సొంతమనుకుని సేవచేస్తున్నా…ఆశీర్వదించండి.భూసేకరణ చేసి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తాం.మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్, డా. పెమ్మసాని.
కరకట్ట కమలాసన్ గా పేరొందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే… నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రెండునెలల క్రితం చెప్పాడు. మళ్లీ ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీ వద్దకు వచ్చినపుడు గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలంతా ఆర్కేని నిలదీయాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు, నూతక్కి, కుంచనపల్లిలో జరిగిన రచ్చబండ సభలకు యువనేత హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజునుంచే మంగళగిరి నా సొంతమనుకుని సేవలందిస్తున్నా. అయిదేళ్లుగా సొంతనిధులతో 29సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను. 4ట్యాంకర్లు పెట్టి తాగునీరు అందించాను, వర్షంపడి రోడ్లుపాడైతే సొంతడబ్బుతో గ్రావెల్ వేశాను. అధికారంలో లేకపోయినా యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గుండెలమీద చేయివేసుకుని ఆలోచించండి. 25ఏళ్లుగా ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన వారు నేను చేసిన పనుల్లో పదోవంతు అయినా చేశారా? గత ప్రభుత్వ హయాంలో రేవేంద్రపాడు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తే, వైసిపి అధికారంలోకి వచ్చాక నిలిపివేశారు. అయిదేళ్లుగా కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంది. 2నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రేవేంద్రపాడు బ్రిడ్జి నిర్మిస్తా. జగన్ అధికారంలోకి రాష్ట్రానికి గుంతల రోడ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఆర్కే ఏం చెప్పారు? ఇళ్లు లేని వారందరికీ ఇళ్లపట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కరికైనా పట్టా ఇచ్చారా? నియోజకవర్గంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది. అధికారంలోకి వచ్చాక అండర్ గ్రౌండ్ డ్రైనేజి చేపడతాం. పక్కనే కృష్ణానది ఉన్నా ఇక్కడి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడటం విచారకరం. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికీ కుళాయి అందించే బాధ్యత నాది. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను అంటూ రకరకాలపై ప్రజలపై భారాలు మోపారు. యువగళం పేరుతో కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. వాటన్నింటినీ పరిశీలించాక చంద్రబాబు, పవనన్న సూపర్-6 హామీలను ప్రకటించారు. లక్షలు ఖర్చుపెట్టి చదివించిన బిడ్డలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే మా ప్రథమ ప్రాధాన్యత, పరిశ్రమలు రప్పించి అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం. సంక్షేమం, అభివృద్ధి సైకిల్ కు రెండు చక్రాలు. పనిచేయడానికి మంగళగిరి నియోజకవర్గానికి వచ్చా. దేశంలోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తా. మీ ఇంటిబిడ్డలా భావించి రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించి సేవచేసే అవకాశం కల్పించాలని లోకేష్ కోరారు.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు:2019లో జగన్ ను చూసి వైయస్సార్ కొడుకు, ఓదార్పు యాత్ర చేస్తున్నాడు అని నమ్మి ప్రజలు 151 సీట్లతో గెలిపించారు. గెలిచిన తర్వాత 30 ఏళ్ల ప్రజాభిమానం సంపాదించాల్సిన జగన్ ప్రజలను వేధిస్తున్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ నాయకుడు కూడా ప్రజల కష్టం, చెమటతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడానికి ఇష్టపడరు. ప్రజల కోసం తన జీవితాన్ని ధార పోసిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించిన జగన్ తన వికృత పాలనను మరోసారి చూపించారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన అయోధ్య రామిరెడ్డికి బాబు గారు అప్పట్లో పలు బాధ్యతలు అప్పగించారు. వేస్ట్ మేనేజ్మెంట్, ఐ.టి అభివృద్ధి బాధ్యతలు అప్పగిస్తే అందులో అవినీతి చేసిన అయోధ్య రామి రెడ్డి ఇవాళ మంగళగిరిలో అరాచక రాజ్యమేలుతున్నారు. అయోధ్యరామిరెడ్డిని, ఆర్కెను ఒకటే అడుగుతున్నాను.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఒక తట్ట మట్టి అయినా ఎత్తారా? కనీసం ఒక రోడ్డుకు ప్యాచ్ వర్క్ అయినా పూర్తి చేశారా? పార్లమెంటు పరిధిలో ఒక కాపు సోదరుడిని బెదిరించి, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించి మరీ వైసీపీ బరిలోకి దింపుతుంది. తనకు ఇష్టం లేదు మహాప్రభో అని ఆ వ్యక్తి మొత్తుకున్నా, ఈ జగన్ బలవంతంగా పోటీ చేయిస్తున్నారు.
లోకేష్ దృష్టికి రేవేంద్రపాడు, నూతక్కి గ్రామస్తుల సమస్యలు
దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో నిర్వహించిన రచ్చబండ సభలో గ్రామస్తులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇళ్లులేని వారికి ఇంటిపట్టాలు ఇప్పించాలి. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లేదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో పెన్షన్ ను నిలిపివేస్తున్నారు. రోడ్డువిస్తరణలో మసీదు పోయేలా ఉంది. ముస్లింలకు మసీదు, కమ్యూనిటీ హాలు, ఖబరస్థాన్ ఏర్పాటుచేయాలి. 80లక్షలు మంజూరయ్యాయని చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే 80రూపాయలు కూడా ఇవ్వలేదు. దళితులకు శ్మశానవాటిక లేదు. రేవేంద్రపాడు పొలిమేరల్లో పొలాలకు వెళ్లే పుంతరోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. నూతక్కి ప్రజలు తమ సమస్యలు చెబుతూ మురుగునీరు పంటకాల్వల్లోకి వస్తుంది, డ్రైన్ల నిర్మాణం చేపట్టాలి. లంకభూములకు పట్టాలిచ్చి, వరదల బారినుంచి కాపాడాలి. ఇంటర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలి. ఇసుక కొరత వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. కుంటిసాకులతో పెన్షన్లలో కోతలు విధిస్తున్నారని చెప్పారు. లోకేష్ స్పందిస్తూ… ఇళ్లులేనివారికి ఇళ్లపట్టాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇస్తాం. సిసిరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. పంటకాల్వలకు లాకులు ఏర్పాటు చేస్తాం. శ్మశానవాటికల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. భూసేకరణ చేసి జనాభా దామాషా ప్రాతిపదికన శ్మశానాలకు స్థలాలను కేటాయిస్తాం. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు మసీదు, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బలోపేతం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.”