“నేనైతే జగన్ మొహాన కొట్టేవాడిని. + మూడు రాజధానులు కావాలన్న రోశయ్య పై పెమ్మసాని ఫైర్. గుంటూరు: ‘700 ఎకరాల గ్రావెల్ తవ్విన రోశయ్య అక్రమ సంపాదనను వెనకేసుకున్నారు. అందుకే జగన్ చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్ చెప్పమంటే మాత్రం చెప్పేస్తారా? ప్రజల గురించి ఆలోచించేది లేదా? అదే నేనైతే రాజీనామా చేసి జగన్ మొహాన కొట్టి వచ్చేవాడిని.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని స్థానిక 38వ డివిజన్లోని బృందావన్ గార్డెన్స్ టెంపుల్ రోడ్డులో వేములపల్లి విఠల్ ఆధ్వర్యంలో,
మాజీ రిటైర్డ్ మున్సిపోల్ కమిషనర్ దేవినేని కరుణచంద్రబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులే కావాలని ఒక రాజధాని వద్దు అని ప్రకటించిన పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోగా ఉన్న రాజధానిని కూడా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ. 2,300 కోట్లు అవినీతి చేశారు కాబట్టే, జగన్ చెప్పినదానికల్లా తల ఊపుతున్నారని విమర్శించారు. అందుకే ఎంపీగా ఓడిపోతారని తెలిసినా సరే గత్యంతరం లేక రోశయ్య పోటీ చేస్తున్నారని అన్నారు. అదే రోశయ్య స్థానంలో తాను ఉండి ఉంటే పదవికి రాజీనామా చేసి, జగన్ మొహాన విసిరి వచ్చేవాడినని, ఆయన కాబట్టి చేతులు కట్టుకుని ఉన్నారని తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న రజనీ గారు ఒక సిస్టమాటిక్ గా అవినీతి చేస్తున్నారని, అందుకే చిలకలూరిపేట ప్రజలు వద్దన్నా వద్దనుకున్నారని వివరించారు. అందువల్లే ఓటమి భయం కొద్దీ గుంటూరు వచ్చి ఆమె చేరారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలస పోవాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పార్లమెంట్, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలను తీసుకురావాలంటే ఒక కఠోర శ్రమ అవసరమని సొంత నేలపై, పుట్టిన భూమిపై ప్రేమ ఉన్నవారికి మాత్రమే ఆ ప్రయత్నం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ ఈ అరాచక ప్రభుత్వాన్ని అరికట్టాలంటే ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి కృషి చేయాలని చెప్పారు. చెప్తే వినే వాళ్లను మాత్రమే గాక మిగతా వారికి కూడా ఓటు ప్రాధాన్యత, జగన్ ప్రభుత్వ అరాచకం గురించి వివరించాలని కోరారు. స్థానికంగా పొలిటికల్ సిస్టం నాలెడ్జ్ గురించి అవగాహన లేక ఏర్పడ్డ గ్యాప్ ను సవరించడానికి అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల హరి, స్థానిక నాయకులు విఠల్రావు, కార్పొరేటర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.”
Tags: No Categories