అవినీతి పాలన. + జగన్ ప్రభుత్వం పై బీసీ సమావేశంలో పెమ్మసాని విమర్శలు. ‘యావన్మంది వైసీపీ నాయకులు అవినీతి పరులుగా మారారు. చిలకలూరిపేట నుంచి వచ్చిన రజిని అక్రమ వసూలలో రికార్డు సృష్టించగా, అఖిలార్ రోశయ్య అక్రమ మైనింగ్ తో వేలకోట్లు వెనకేసుకున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏ-వన్ కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ… పెమ్మసాని చంద్రశేఖర్ గారు: ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి నుంచి పోటీ చేస్తున్న విడుదల రజనీ గారికి ఏ అర్హత లేకపోయినా వైద్య శాఖ మంత్రిగా ఎలా నియమించారు? దళితుల కు చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించడం వల్ల ఆమెకు మంత్రి పదవి వచ్చింది. అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్యం అందించే డాక్టర్లను కూడా కొందరు అవినీతిపరులు వేధిస్తున్నారు. అదేమని అడిగితే ఫీజులు పెంచమని, పెంచిన ఫీజులను ప్రజలపై మోపమని సలహా ఇస్తున్నారు. పథకాలు ఇస్తున్నారు కదా! అని ఈ వైసీపీ నాయకులకు ఓట్లు వేస్తే ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి ప్రజలను వేధిస్తుంటారు. మరోవైపు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కిలారు రోశయ్య ప్రజలకు సంబంధించిన 700 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ తవ్వి, అవినీతి సంపాదనకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు నాయకులు అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నారు. కానీ నేను కష్టాలను చూస్తూ పెరిగాను. కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చి, మీ ఎదురుగా ఇలా నిలబడగలిగాను. * ఎక్కడెక్కడ పనులు దొరికితే అక్కడకు పిల్లలతో సహా వెళ్లి పనులు చేసుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులు మీరు. చదవకపోయినా ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల వంటి గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తులు మీరు. గడచిన ఐదేళ్లుగా ఆదాయాలు పెరగకపోయినా నిత్యవసరకుల ధరలు, పెట్రోలు, ఇతర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసే కొంతమంది కార్మికులు సాయంత్రానికి కొంచెం మద్యం తీసుకుందామంటే అవి కాస్తా ప్రాణాంతకమైన రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. ఇవాళ, రేపు ఒక తోపుడు బండి పైనా డిజిటల్ పేమెంట్లు జరుగుతుంటే, ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్ లకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది. నివాసాలు లేనివారికి ఇల్లు కల్పించడం లేదా టిట్కో నివాసాలు అందించడం వంటి సహకారాలు అందిస్తాం. పిడుగురాళ్ల మాధవి: గడిచిన ఐదేళ్లలో ఈ జగన్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. క్వారలను అన్యాక్రాంతం చేస్తూ తమ పార్టీ నాయకులకు ఈ వైసిపి ప్రభుత్వం కట్టబెట్టింది. వడ్డెర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, వందల కోట్లను కేటాయించిన టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ను కేటాయించి నయా పైసా నిధులు ఇవ్వకుండా అవమానిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వడ్డెరలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారు. ఒక అసమర్థుడైన, అవినీతిపరుడైన నాయకుడు చేతిలో ఇటుక రాయి ఉంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రజల తలలు పగల కొడుతుంది. అదే సమర్ధుడైన నాయకుడు చేతిలో పెడితే ఒక నూతన నిర్మాణానికి నాంది పలుకుతుంది. అందరికీ మంచి చేయాలని వచ్చిన పెమ్మసాని గారి వంటి నాయకులు, చట్ట సభల్లో గళం విప్పాలనుకునే నా వంటి వారిని గెలిపిస్తే, అభివృద్ధికి బాటలు వేస్తాం. * ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, పశ్చిమ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి బాబు, టిడిపి జిల్లా పార్టీ కన్వీనర్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories