టిడిపికి కంచు కవచంలా నిలబడతాం.మీ ముది మనవడు కూడా టిడిపిని టచ్ చేయలేరు. గుంటూరుకు నువ్వు రా! నేను సిద్ధం.జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పెమ్మసాని. ‘టిడిపిని జగన్ తక్కువ అంచనా వేశారు.మీరు కాదు కదా, మీ ముది మనవడు కూడా టచ్ చేయలేరు. టిడిపి, చంద్రబాబు, లోకేష్ కు, కంచు కవచంలా అడ్డం నిలబడతాం.’ అని అధికార పార్టీ పై గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని గారు రోడ్ షోను బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దారి పొడవున పూలవర్షంతో గ్రామస్తులు స్వాగతం పలుకగా, పలు కూడళ్ళలో ఎక్స్ కవేటర్ల సహాయంతో భారీ గజమాలతో ప్రజలు తమ ఊళ్ళలోకి ఆహ్వానించారు. కాగా అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 16 నెలలపాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ లో మార్పు వచ్చి ఉంటుందని నమ్మి అప్పట్లో ప్రజలు భావించారని, అందుకే 151 సీట్లతో అధికారంలో కూర్చోబెట్టారు అన్నారు. అయితే కృతజ్ఞత తీర్చుకోవాల్సిన జగన్ ప్రజలపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టారని, ప్రజా వేదిక కూల్చివేతతోనే ఆయన తన అరాచక పాలన ప్రారంభించారని విమర్శించారు. మద్యం – అరాచకం. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఎంతోమంది నాయకులు, పెద్దల వద్దకు వెళ్లి పరిశ్రమలు, హాస్పిటళ్ళు, రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి 120 సంస్థలను తీసుకువచ్చారని చెప్పారు. కానీ ఆ సంస్థలను రద్దు చేసిన జగన్ ఏపీలో నాసిరకం, కల్తీ మద్యాన్ని అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. మద్యం కనిపెట్టిన వాళ్లకే అర్థం కాని బ్రాండ్లు తయారుచేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. రూ. 60 లు ఉండే మద్యం బాటిల్ ధరను రూ. 200 చేసిన జగన్, అందులో 70 శాతం వాటాలను తన తాడేపల్లి ప్యాలెస్ కు తరలిస్తున్నారని విమర్శించారు. మందుబాబుల బలహీనతలను అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్న సొమ్ముతో ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమానంగా జరిగిన రోజే ప్రజాస్వామ్యంలో ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలరని తెలిపారు. కన్స్ట్రక్షన్ కావాలి – డిస్ట్రక్షన్ కాదు. ‘మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదు. కన్స్ట్రక్షన్ కావాలి, డిస్ట్రక్షన్ కాదు. టిడిపిని ఓడిస్తే ఇక తిరుగులేదని పిచ్చి భ్రమలో ఉన్న జగన్ కు ఒక్కటే చెప్తున్నాను, టిడిపి – చంద్రబాబు -లోకేష్ కు మేమంతా కంచు కవచంలా అడ్డం నిలబడతాం. జగన్…. ఆయన తండ్రిగారు, తాతగారే కాదు, ముది మనవడు కూడా మా టిడిపిని టచ్ చేయలేరు. వాళ్లు వీళ్లు కాదు, దమ్ముంటే గుంటూరుకు నువ్వు రా జగన్. నీ క్యాండిడేట్ వెళ్ళిపోతాను అంటున్నారు కదా! మాట మాట్లాడితే అభ్యర్థిని మారుస్తున్నావు కదా! ఇప్పటికి నలుగురిని మార్చారు, ఐదో వాడిగా నువ్వు రా! జగన్… నేను సిద్ధం.’ అని జగన్, వైసీపీ ప్రభుత్వానికి పెమ్మసాని ప్రజా సమక్షంలో సవాల్ విసిరారు. జగన్ చేసే అప్పు మన నెత్తినే పడుతుంది – తెనాలి శ్రావణ్ కుమార్. ‘ప్రజల్లో జగన్ చేసే అప్పులపై కొన్ని అపోహలు ఉన్నాయి. రాష్ట్రంలో అప్పులు చేస్తుంది జగన్ కదా! మనకేం ఇబ్బంది వస్తుందిలే అని ప్రజలు అనుకుంటే పొరపాటే. మనం ప్రతి నెలా చెల్లిస్తున్న కరెంటు బిల్లులు, పెట్రోల్ ధరలు, పన్నులు దశలవారీగా పెంచిన జగన్, ఆ అప్పులను ప్రస్తుతం మన నుంచే వసూలు చేసే పనిలో ఉన్నారని గుర్తించాలి. ఏ రాష్ట్రంలో లేనంత జీఎస్టీ ఏపీలో మాత్రమే ఉంది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో మనకంటే తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. ఒక్కసారి ప్రజలంతా టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. మంచి నాయకత్వానికి ఓటేసి అమరావతిని నిలబెట్టుకోవాలి.’ అని తాడికొండ నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు టిడిపి, బిజెపి పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి డాక్టర్ పెమ్మసాని, శ్రావణ్ కుమార్, బిజెపి నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విజయ్ శేఖర్, టిడిపి నాయకులు డాక్టర్ శేషయ్య, అలాగే మండల నియోజకవర్గస్థాయి టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.